అంగరంగ వైభవంగా శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం , వైభవంగా జరిగిన శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం.
ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది.ఉదయం 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు.ఉదయం 7 గంటలకు అనంతనామధేయుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను నిర్వహించారు.
లోక కళ్యాణం కొరకు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో సుదర్శన నరసింహ హవనం నిర్వహించారు.
ఉదయం 10:30 లకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సువర్ణభరిత వజ్రాభరణాలతో,సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీ స్వామివారి కల్యాణమహోత్సవాన్ని తిలకిస్తూ దివ్యానుభూతిని పొందారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3500 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.